
● విశాఖ నగరం, మన్యానికి పోటెత్తిన పర్యాటకులు
అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని హోటళ్లు.. హరిత రిసార్ట్స్ ఫుల్!
● గతేడాదితో పోలిస్తే 25 శాతం అధికంగా రాక
బెంగాల్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి అత్యధిక పర్యాటకులు
● జనవరి రెండో వారం వరకూ హోటళ్లు, రిసార్టులు బుకింగ్ లు!
రాబోయే కొత్త ఏడాదిలో కొత్త అధ్యయనం
ప్రకృతి పరవశిస్తుంది.. జలపాతాల సోయాగాలు నాట్యమాడుతున్నాయి. చుట్టూ పచ్చిక బయళ్లు.. అడవిలో కనిపించి మనకు అందాలు..కాలం మారుతోంది.. ఏడాది వీడ్కోలు పలకనుంది.. కానీ ఉమ్మడి విశాఖ అందం మాత్రం రెట్టింపవుతోంది. సముద్రపు అలల మధ్య కేరింతలు కొట్టేందుకు, మన్యం అడవుల్లో ప్రకృతిని పలకరించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. ముందెన్నడూ లేని విధంగా పర్యాటక కేంద్రాలన్నీ సందర్శకులతో నిండిపోయాయి. ఎక్కడ చూసినా ‘హౌస్ఫుల్’ బోర్డులు కనిపిస్తున్నాయి. వాహనాల రద్దీ కారణంగా అరకు, పాడేరు ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు ఆంక్షలు
విధించారు. ఉమ్మడి విశాఖ పర్యాటకంలో ఇదో కొత్త అధ్యాయంగా నిలువనుంది.
ఇబ్బందులు లేకుండా చర్యలు
ఈ ఏడాది విశాఖకు పర్యాటకుల తాకిడి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. ప్రతి రోజూ 50 వేల మంది కంటే ఎక్కువ మంది విశాఖలోని పర్యాటక ప్రాంతాల్ని సందర్శిస్తున్నారు. విశాఖ నగరంతో పాటు అరకు, అనంతగిరి, లంబసింగి వంటి ప్రాంతాల్లోని మా పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, హరిత రిసార్టులు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంది. పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, వారికి మెరుగైన ఆతిథ్యం అందించేందుకు మా సిబ్బంది అదనపు సమయం పనిచేస్తూ తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
